శంఖం మినహా వేరే ఆయుధాలు ధరించని శ్రీకృష్ణుడు మీసాలతో దర్శనం ఇచ్చే ఒకే ఒక ఆలయం !!

తిరువల్లిక్కేణి పరమ పవిత్రమైన 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి. చెన్నై మహానగరంలో వెలసిన ఈ పురాతన ఆలయం పార్థసారథి స్వామి వారికి సంబంధించినది. తమిళంలో తిరు అంటే గౌరవ వాచకం, అల్లిక్కేణి అంటే కలువ పువ్వులు ఉన్న చెరువు. 

ఒకప్పుడు ఈ ప్రాంతమంతా ఎక్కువగా కలువ పువ్వులతో నిండిన చెరువులతో ఉండడం వల్ల తిరువల్లిక్కేణి అని పేరు వచ్చింది. కాలక్రమంలో బ్రిటిష్ వారి పాలనలో ఆ పేరు ట్రిప్లికేన్ గా రూపాంతరం చెందింది.
Parthasarathy Temple Chennai
సుమతి అనే ఒక రాజుగారి కోరిక మేరకు తిరుమలలోని శ్రీనివాసుడే ఇక్కడ పార్థసారథిగా వెలసినట్లు, అలాగే ఆత్రేయ మహర్షి ఈ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు ఐతిహ్యం. సంస్కృత భాషలో పార్థసారథి అంటే అర్జునుడు యొక్క రథాన్ని నడిపినవాడు అని అర్థం. 

ఈ ఆలయంలో ప్రధాన దైవం- విష్ణుమూర్తి అవతారం అయిన శ్రీకృష్ణుడు. మరెక్కడా లేని విధంగా, ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు మీసాలతో దర్శనం ఇస్తాడు.
Parthasarathy Temple Chennai
ఈ ఆలయానికి రెండు వేర్వేరు ధ్వజ స్తంభాలు ఉంటాయి. ఒకటి తూర్పువైపునున్న గర్భగుడికి ఎదురుగా, మరొకటి పడమరవైపునున్న యోగనరసింహ స్వామి వారి దేవాలయానికి ఎదురుగా ఉంటాయి. 

తెలుగులో గీతా ప్రెస్ వారి శ్రీమద్భగవద్గీత: Srimad Bhagavad Gita - Sachitra, Shlokarth Sahit
Advertisement*

ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, కురుక్షేత్రం యుద్ధంలో కొన్ని బాణాలు శ్రీకృష్ణుడికి కూడా తగలడం వల్ల, ఇక్కడ నెలకొన్న స్వామివారి ముఖంపై వాటి తాలూకు మచ్చలు కనిపిస్తాయి. అలాగే శ్రీకృష్ణుడు కురుక్షేత్రం యుద్ధంలో శంఖం తప్ప వేరే ఆయుధం పట్టకపోవడంతో, ఇక్కడి మూలవిరాట్ చేతిలో సుదర్శన చక్రం కనిపించదు.
Parthasarathy Temple Chennai
ఈ ఆలయంలో పార్థసారథితో పాటు రుక్మిణీదేవి, వారి కొడుకు అయిన ప్రద్యుమ్నుడు, అలాగే మనవడైన అనిరుద్ధుడు, ఇంకా కృష్ణుడి అన్నగారైన బలరాముడు, తమ్ముడైన సాత్యకి వంటి మహావీరులందరూ ఒకే చోట కొలువై ఉండడంతో ఈ క్షేత్రం "దక్షిణ భారతదేశపు బృందావనం" గా విరాజిల్లుతోంది.
Parthasarathy Temple Chennai
ఇక్కడ పంచ మూర్తులుగా వెలిసిన స్వామివారిని సప్తఋషులు సేవించి తరించినట్లు బ్రహ్మాండపురాణం చెపుతోంది. 

ప్రధాన దైవం అయిన పార్థసారథితో పాటు రామచంద్ర మూర్తి వారిని నిల్చున్న విధంగా, నరసింహ స్వామిని కూర్చున్న విధంగా, రంగనాథ స్వామిని శయనించిన విధంగా, గజేంద్ర వరదరాజుని పయనించుచున్న విధంగా దర్శించుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతమే!!!
Parthasarathy Temple Chennai
దేవాలయానికి వెలుపల ఉన్న పుష్కరిణిని కైరవణి అని పిలుస్తారు- ఇందులో ఇంద్ర, సోమ, మీనా, అగ్ని, విష్ణు అనే ఐదు తీర్థాలు ఉన్నట్లు చెబుతారు. అలాగే పుష్కరిణిలోని ఒక కమలంలో మహాలక్ష్మిదేవి భృగుమహర్షికి కూతురుగా జన్మించి, రంగనాథ స్వామిని వివాహం చేసుకుని, వేదవల్లి అనే పేరుతో ఇక్కడ స్థిరపడి భక్తులను అనుగ్రహిస్తోంది.
Parthasarathy Temple Chennai
ఈ ఆలయాన్ని పల్లవరాజులు 8వ శతాబ్దంలో నిర్మించారు. ఆ తర్వాత 10వ-15వ శతాబ్ధాల మధ్యలో చోళ రాజులు, విజయనగర చక్రవర్తులు ఈ ఆలయాన్ని మరింతగా విస్తరించారు. వాటికి సంబంధించిన శిలాశాసనాలు ఈ ఆలయ ఆవరణలో చూడవచ్చు. 

శ్రీ రంగ రంగ: ARTVARKO Lord Ranganatha Swamy - Touching Shiva Lingam, Brahma from Navel - Brass, 7.5 Inches
Advertisement*

అలాగే పార్థసారథి సుప్రభాతం, విష్ణు సహస్రనామం, శ్రీవేంకటేశ్వర సుప్రభాతం, మరీ ముఖ్యంగా మనం ధనుర్మాసంలో పారాయణం చేసే తిరుప్పావై కూడా ఈ ఆలయ గోడలపై చాలా చక్కగా చెక్కారు.
Parthasarathy Temple Chennai
రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడైన స్వామి వివేకానంద పార్థసారథి వారి భక్తుడు. 1893వ సంవత్సరంలో తన శిష్యుడైన అలసింగకు రాసిన ఒక లేఖలో, పార్థసారథి వారి గొప్పతనం ప్రస్తావన చేయబడింది. ఈ ఆలయ గోడలపై చెక్కబడిన ఆ లేఖను ఇప్పటికీ చూడవచ్చు.
Parthasarathy Temple Chennai
డిసెంబర్-జనవరి నెలల్లో వైకుంఠ ఏకాదశి రోజున పార్థసారథి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు. అలాగే ఏప్రిల్-మే నెలల్లో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. 

శ్రీ పార్థసారథి స్వామివారి అనుగ్రహం వల్ల జన్మించిన రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైతాన్ని ఆచరణలోకి తీసుకువచ్చేలా చేశారు. అందుకే శ్రీవైష్ణవ సంప్రదాయాభివృధ్ధికి ఎంతో పాటుపడిన ఆయనకు బ్రహ్మోత్సవాలలో తగిన రీతిలో గౌరవం ఇస్తారు.

| అదనపు సమాచారం: శ్రీ రామానుజాచార్యుల వారి జన్మస్థలం & మోక్షస్థలం ఎక్కడ ఉన్నాయో తెలుసా?

Parthasarathy Temple Chennai
మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!

Comments